కొవిడ్ తో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన చిన్నారుల భవిష్యత్తు విషయంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనాథలైన పిల్లలకు 25ఏళ్లు వచ్చేదాకా నెలకు 2 వేల 500 చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఉచిత విద్య అందిస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా మహమ్మారితో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఉచిత రేషన్ అందజేస్తామన్నారు. దిల్లీలో 72 లక్షల రేషన్ కార్డు దారులకు ప్రతి నెల 5 కిలోల రేషన్ బియ్యం ఇస్తున్నప్పటికీ ఈ నెల మరో 5 కేజీలు అదనంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. దిల్లీలో కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 50వేల రూపాయల చొప్పున సాయం చేస్తామని తెలిపారు. ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నెలకు 2 వేల 500 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. ఇంట్లో సంపాదించే భర్తను కోల్పోయిన భార్యకు, వివాహం కాని కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులకు ఈ సాయాన్ని అందజేస్తామన్నారు.